అమరావతి: ఏపీ రాజధాని అమరావతి తరలింపు అంశంలో హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ముఖ్యనేతలతో అధ్యక్షుడు కొణిదెల పవన్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఏకాభిప్రాయం వచ్చింది.
రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తుదివరకు బాధ్యతగా నిలబడతామన్నారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని మా అభిప్రాయమని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టారు.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. రాజధాని కోసం ఇప్పటికే రూ.వేల కోట్లు వెచ్చించారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.