హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నిర్ణయిస్తూ జారీ చేసిన జీఓను ఉల్లంఘించిన విద్యాసంస్థలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చామని, గుర్తింపు రద్దు ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
జీఓ ఉల్లంఘించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జార చేసింది.
బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులపై కేసులు పెట్టారని న్యాయవాది తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ రద్దు చేస్తున్నారని తెలిపిన హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ పీఏ) తరఫు న్యాయవాది తెలిపారు.
తల్లిదండ్రులపై ఏ కారణంతో ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 18 వాయిదా వేసింది. ఇవాళ హైకోర్టులో ఆన్ లైన్ తరగతులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై విచారణ జరిగింది. ఆన్ లైన్ తరగతులపై విధి విధానాలు ఖరారు చేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. టీ శాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. టీవీ పాఠాల్లో విద్యార్థులకు అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. సందేహాలు నివృత్తి చేసేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని వివరించారు.
ఒక కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఒకేసారి టీవీ పాఠాలు ఎలా వింటారని హైకోర్టు ప్రశ్నించింది. 1 నుంచి 10వ తరగతి వరకు వేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారమవుతాయన్నారు. ఆన్ లైన్ తరగతులకు హాజరు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులపైనే మా ఆందోళన అని వెల్లడించింది. ప్రభుత్వ విధి విధానాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని పిటిషనర్లను హైకోర్టు సూచించింది.